తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతిపై అసంతృప్తి

తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా పర్యటన కు వచ్చిన ఆయన జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ  ఇవాళ  కేవలం భద్రకాళి అమ్మవారి దర్శనం కోసమే పర్యటిస్తున్నానని చెప్పారు. 
 
వరంగల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సందర్శిస్తానని తెలిపారు.  తెలంగాణ ప్రజలు మార్పు రావాలని కోరుకుంటుని అంటూ అది దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వస్తుందని స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయని వివరించారు. రానున్న రోజుల్లో  తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ కారుల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని భరోసా వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన అద్భుతమైన పాలన అందిస్తోందని చెప్పారు. 
 
కావాలని పనికట్టుకుని కొన్ని  రాజకీయ  పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతు వ్యవసాయ చట్టంలో  ఏ ఒక్క అంశం కూడా రైతులకు వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పంజాబ్లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదని చెప్పారు.
 
శరద్ జోషి ,స్వామినాథన్, వ్యవసాయ శాస్త్ర వేత్తలు, మేధావులు వ్యవసాయ బిల్లుకు మద్దతు పలికారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలకు ప్రజలతో  సంఘటితంగా ఉండి  ముందుకు రాగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటన అనంతరం దివంగత నేత నోముల నర్సింహయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.