చర్చల సమయంలో నిరసనలు తీవ్రతరమా!

నూతన వ్యవసాయ చట్టాలపై చర్చలు కొనసాగుతున్న దశలో నిరసనలను తీవ్రతరం చేయడం సరికాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హితవు చెప్పారు. చర్చల్లో ప్రతిష్టంభన లేదని, చర్చల సమయంలో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. 

తమకు నష్టం కలిగిస్తుందని రైతులు భావించే నిబంధనలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  చర్చలు జరుగుతుండగా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను ప్రకటించడం సరికాదని విమర్శించారు. చర్చల సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చుని తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, ఏ చట్టమూ పూర్తిగా చెడ్డది కాదని పేర్కొన్నారు. ఈ చట్టాల్లోని ఏ నిబంధనలు తమకు నష్టం కలిగిస్తాయని రైతులు భావిస్తున్నారో, ఆ నిబంధనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రతిపాదనలను నిన్న (బుధవారం) రైతులకు పంపించామని, అయితే రైతులు తమ తదుపరి దశ ఆందోళనను ప్రకటించారని, ఇది సరికాదని విచారం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలను విరమించుకోవాలని, చర్చలు ప్రారంభించాలని వారికి మరోసారి విజ్ఞప్తి చేశారు. 

రైతులు చలిలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిశీలించాలని, తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 

కాగా, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి ఈ చట్టాలతో సంబంధం లేదని తోమర్ స్పష్టం చేశారు. ఎంఎస్‌పీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అయినప్పటికీ దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని తోమర్ తెలిపారు. తనతో పాటు ప్రధాని మోదీ కూడా రైతులకు కనీస మద్దతు ధరపై రైతులకు భరోసానిస్తున్నామని, ఎంఎస్‌పీ కొనసాగుతుందని నరేంద్ర సింగ్ తోమర్ కుండబద్ధలు కొట్టారు.