మమతా అంటేనే అసహనానికి పర్యాయపదం 

మమతా బెనర్జీ అంటేనే అసహనానికి పర్యాయపదంగా మారిపోయిందని అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా విరుచుకు పడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పభుత్వంలో అసహనం ఘోరంగా పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాలలో తొమ్మిది పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. టీఎంసీ కుటుంబ పార్టీ అని, అక్కడ నాయకుల వారసులే రాజకీయాల్లోకి వస్తారన్నారని విమర్శించారు.
కానీ బీజేపీలో వారసులు ఉండరని, పార్టీయే తమకు కుటుంబం అని స్పష్టం చేశారు. బెంగాల్‌తో బీజేపీకి ఎంతో అనుబంధం ఉందని పేర్కొంటూ బీజేపీకి ఇద్దరు జాతీయ అధ్యక్షులను అందించిన రాష్ట్రం బెంగాలేనని కొనియాడారు. 
బెంగాల్‌ రక్షించేందుకు కమలదళం సిద్ధంగా ఉందని నడ్డా స్పష్టం చేశారు. మమతా హయంలో అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువ జరుగుతున్నాయని ఆయన మంది పడ్డారు.  2021 ఎన్నికల్లో 200 స్థానాలకు పైగా విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.