బిజెపి సీనియర్ నేతలపై బెంగాల్ పోలీసుల కేస్ 

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం, అధికార పక్షం టిఎంసికి బిజెపి పెను సవాల్ గా మారడంతో బిజెపి నేతలపై దాడులు, పొలిసు కేసులు పెరుగుతున్నాయి. 
 
తాజాగా,  దాడులు  సిలిగురిలో బీజేపీ ర్యాలీ సందర్భంగా హింసను ప్రోత్సహించారనే ఆరోపణలపై పశ్చిమబెంగాల్ పోలీసులు ప్రముఖ బీజేపీ నాయకులు కైలాష్ విజయవర్గియా, తేజస్విసూర్య, దిలీప్ ఘోష్, ఇతర బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు. 
 
సిలిగురిలో డిసెంబరు 7వతేదీన బీజేపీ ర్యాలీ సందర్భంగా హింసను ప్రేరేపించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ వర్గియా, ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ లపై  న్యూ జల్పాయిగురి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 
 
 బీజేపీ నేతలు సౌమిత్రా ఖాన్, సయంతన్ బోస్, సుకాంత మజుందర్, నిసిత్ ప్రమానిక్, రాజు బిస్టా, జాన్ బిర్లా, ఖోగైన్ ముర్ము, సంకుదేబ్ పాండా, ప్రవీణ్ అగర్వాల్ తదితరులపై పోలీసులు అభియోగాలు మోపారు. బీజేపీ నేతలు హింసను సృష్టించడానికి శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులతో ఘర్షణకు దిగి ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీశారని పోలీసులు ఆరోపించారు.