ట్విట్టర్ లో అత్యధికంగా మోదీ ట్వీట్ రీట్వీట్ 

సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక రికార్డులను నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో అతి ఎక్కువ మంది ఫాలోవర్లతో మోదీ అనేక ఘనతలు సాధించారు. 

కాగా, ట్విట్టర్‌లో మోదీ మరో ఘనత సాధించారు. 2020కి సంబంధించి రాజకీయ వేత్తల ట్వీట్లలో ఎక్కువ సార్లు రీట్వీట్ అయిన పోస్ట్‌ మోదీదేనట. లక్షకు పైగా రీట్వీట్లతో సదరు ట్వీట్ 2020 రికార్డును సృష్టించింది. ఇక అదే ట్వీట్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు రావడం మరో విశేషం. 

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ట్విట్టర్‌లో 64 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన మొదట్లో.. కోవిడ్-19 నిబంధనలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఏప్రిల్ 5న దేశంలోని ప్రతి ఒక్కరు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.

కొవ్వోత్తులు, మట్టితో చేసిన దీపాలతో పాటు మొబైల్ ఫోన్ల ఫ్లాష్ లైట్ వెలిగించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మోదీ పిలపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనంతరం తాను దీపాలు వెలిగిస్తున్న ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మోదీ షేర్ చేశారు.

అయితే దీనిని నెటిజెన్లు విపరీతంగా షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కు 1.06 లక్షల రీట్వీట్‌లు వచ్చాయి. అయితే 2020కి సంబంధించి ఎక్కువసార్లు రీట్వీట్ అయిన రాజకీయవేత్త ట్వీట్ ఇదేనని ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.