ఎల్బీనగర్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌..పాతబస్తీలో పాగా 

మహేశ్వరంలోని సీట్లన్నీ బీజేపీ కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్‌  సెగ్మెంట్​లో సగానికిపైగా బీజేపీ గెలుచుకుంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ లోని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించింది. మెయిన్‌ సిటీతో పోలిస్తే శివారులో పోలింగ్‌ పర్సంటేజ్‌ ఎక్కువగా నమోదు కాగా.. టీఆర్ఎస్, బీజేపీకి చేరి సగం సీట్లు దక్కాయి.

ఎల్బీనగర్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. చైతన్యపురి, గడ్డి అన్నారం, నాగోల్‌, మన్సూరాబాద్‌, చంపాపేట్‌, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, హస్తినాపురం, లింగోజిగూడ స్థానాలను గెలుచుకుంది.  మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు స్థానాలైన సరూర్‌నగర్‌, మహేశ్వరంలోనూ కమలం పార్టీ గెలుపొందింది. 

2016 ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోగా, అందులో ఆర్కేపురం డివిజన్‌ కూడా ఉంది. ఎన్నికలకు ముందు భారీ వర్షాలకు ఎల్బీనగర్‌లోని చాలా ప్రాంతాలు వరదలకు ఆగమయ్యాయి. టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పట్టించుకోలేదని, అందుకే ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజేంద్రనగర్‌లోనూ బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదింటిలో మూడు స్థానాలను కైవసం చేసుకుంది.

మల్కాజిగిరి లోని  9 డివిజన్లలో 5 సీట్లను టీఆర్ఎస్, మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో రిజల్ట్ ను పెండింగ్ లో పెట్టారు. మూసాపేట, మౌలాలిలోనూ బీజేపీ విజయం సాధించింది.   

ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న పాతబస్తిలో బీజేపీ పాగా వేసింది. టీఆర్ఎస్​ సిట్టింగ్​ స్థానాలైన ఏడు డివిజన్లను,  ఎంఐఎం గెలిచిన ఒక డివిజన్​ను బీజేపీ గెలిచింది  మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. టీఆర్ఎస్​ సిట్టింగ్​ స్థానాలైన ఏడు డివిజన్లను,  ఎంఐఎం గెలిచిన ఒక డివిజన్​ను బీజేపీ గెలిచింది.

ఐఎస్​సదన్​నుంచి జె.శ్వేత, గుడి మల్కాపూర్​ డివిజన్​నుంచి దేవర కరుణాకర్, గోషామహల్​నుంచి లాల్ సింగ్, చంపాపేట నుంచి   మధుసూదన్​రెడ్డి, జియాగూడ నుంచి  దర్శన్, మంగళ్​హట్​నుంచి  శశికళ, సైదాబాద్​నుంచి  అరుణ టీఆర్ఎస్ సిట్టింగ్​స్థానాల్లో గెలిచారు. 

జాంబాగ్  ఎంఐఎం సిట్టింగ్ ​స్థానం కాగా ఇక్కడ  బీజేపీ అభ్యర్థి రాకేశ్​ జైస్వాల్ గెలిచారు.   సిట్టింగ్ స్థానాలైన  బేగం బజార్ నుంచి శంకర్​యాదవ్, గౌలిపుర నుంచి భాగ్యలక్ష్మి గెలుపొందారు.  ఘాన్సీ బజార్​  లో మాత్రం  ఎంఐఎం గెలిచింది.

గ్రేటర్ ఎన్నికల్లో వరుసగా రెండోసారి కూడా సీమాంధ్ర ప్రాంతంపై చెందిన వారు అధికార టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి,  పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్ సెగ్మెంటల్లో మొత్తం 29 డివిజన్లు ఉండగా,  గచ్చిబౌలి , మూసాపేట లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 

మిగతా డివిజన్లను టీఆర్​ఎస్​ గెలుచుకుంది. అయితే  ఇక్కడ పోలింగ్ సహితం చాలా తక్కువగా జరిగింది. 2016 లో టీడీపీ కూకట్ పల్లి డివిజన్ లో మాత్రమే ఒక్క సీటు గెలిచింది. ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు రాలేదు.

కాగా, 78 డివిజన్లలో మహిళలు  గెలిచారు. టీఆర్‌‌ఎస్  నుంచి 28 మంది, బిజెపి నుంచి 26 మంది, ఎంఐఎం నుండి 21 మంది  మహిళా నేతలు విజయం సాధించారు.  కాంగ్రెస్​కు మొత్తంగా రెండు సీట్లు దక్కగా, ఆ రెండింటిలోనూ మహిళలే గెలవడం గమనార్హం.  మహిళలకు 75 సీట్లు రిజర్వు చేయగా, మరో మూడు సీట్లలో కూడా వారు గెలుపొందడం విశేషం.

కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి పరిధిలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించింది. కుత్బుల్లాపూర్‌లో 8 డివిజన్లు ఉండగా, ఏడింటిని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్‌,  చింతల్, సూరారం, సుభాష్‌నగర్‌‌, కుత్బుల్లాపూర్‌ లో టీఆర్ఎస్ గెలవగా.. బీజేపీ జీడిమెట్లలో గెలిచింది. శేరిలింగంపల్లిలో 10 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ 9 సీట్లను కైవసం చేసుకుంది. 

కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, వివేకానంద నగర్ కాలనీ, హైదర్‌నగర్‌, అల్విన్ కాలనీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. ఐటీ కారిడార్‌ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. ఆయా డివిజన్లలో తక్కువ ఓటింగ్‌ నమోదు కావడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు.