ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి, పవన్ అభినందనలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి అఖండ విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్తాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి  అధ్యక్షుడు జెపి నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు తెలంగాణ బిజెపి నేతలను, గ్రేటర్ హైదరాబాద్ బిజెపి కార్యకర్తలను అభినందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయానికి సూచిక అంటూ పేర్కొన్నారు.
ఎన్నికల కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.  కిషన్ రెడ్డిని జేపీ నడ్డా, అమిత్‌లు కూడా ఫోన్‌లో అభినందించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా అమిత్‌ షా అభినందించారు. గ్రేటర్‌లో బండి సంజయ్‌ అద్భుతంగా కృషి చేశారని అమిత్ షా ట్విట్టర్‌లో ప్రశంసించారు.
 
బీజేపీపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు అమిత్ షా కృతజ్ఞతలు అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కృషిని కూడా అమిత్ షా అభినందించారు.   
 
 కాగా, గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు యోగి కృతజ్ఞతలు తెలిపారు.
 
‘‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం, ప్రధానమంత్రి మోదీజీ నాయకత్వంపై అపూర్వమైన విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ యోగి తెలిపారు. సీఎం యోగి ఎన్నికల ప్రచారం తాము హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మారుస్తామని ప్రకటించారు.
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన  ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలుతెలిపారు.
 
 జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్,  బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలు తెలిపారు. 
 
బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతమని పేర్కొన్నారు. 
గెలుపునకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ, తెగువ ఆ పార్టీని విజయం వైపు నడిపించాయని పవన్ ప్రశంసించారు. ఇంటింటికీ తిరిగి శ్రమకోర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చిందని తెలిపారు. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. .