కాశ్మీర్ లో మొదటి సారి పాక్ శరణార్ధుల ఓట్ 

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్‌ నుంచి వలస వచ్చిన శరణార్థులు తొలిసారిగా ఓటు వేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకు్న్నారు. అనంతరం డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వెల్లడించారు. 

జమ్మూ కశ్మీర్‌లో ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఎప్పుడూ పోలింగ్‌లో పాల్గొనలేదు. స్వాతంత్య్రం అనంతరం 70 ఏళ్ల ఎన్నికల చరిత్రలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఓటు వేయడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో తాజాగా జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులు ఓటు వేశారు. ఈ సందర్భంగా డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద పెద్ద పెద్ద క్యూలలో నిల్చున్న వృద్ధ మహిళలు తమ 70 ఏళ్ళ పోరాటం ఇప్పటికి ఫలించింది అంటూ కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు.  

‘‘70 ఏళ్లలో మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్నాం. మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలతో మా కల సాకారమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఒక ఓటర్ పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ శరణార్ధులతో పాటు వాల్మీకి, గుర్ఖా తదితరులు మొదటిసారి కాశ్మీర్ లో పౌరసత్వం పొంది ఓట్ వేయగలిగారు. ఇప్పుడు వారు అక్కడ భూముల కొనుగోలుకు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అర్హత పొందారు. 

పశ్చిమ పాకిస్థాన్ నుండి శరణార్థిగా వచ్చి అక్కనూర్ లో స్థిరపడిన ప్రీతమ్ చాంద్ (88) ఓట్ వేస్తూ తన జీవిత కాలంలో తనను న్యాయం జరుగుతోందని తాను అనుకోలేదని ఉద్వేగంతో చెప్పారు.  చాలా ప్రభుత్వాలు తమకు భూటకపు వాగ్దానాలు చేసినా తమను  పట్టించుకోకుండా,తమ పిల్లల భవిష్యత్ ను చీకటిలోకి నెట్టివేశాయని ఆమె ఆవేదన  వ్యక్తం చేసారు. 

ఎన్ని చదువులు చదివినా తాము ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రొఫెషనల్ కోర్స్ లలో చేరడానికి అర్హులం కాక పోవడంతో చాలామంది తమ బిడ్డలు చదవడానికి కూడా విముఖంగా ఉంటూ వచ్చారని ఆమె చెప్పారు.