ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా  చేయాలి 

ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తునే పరిగణలోకి తీసుకోవాలంటూ ఆదేశించిన హైకోర్టుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది అని ఆనందం వ్యక్తం చేశారు. 
 
అడ్డదారుల్లో గెలవాలని చూసిన టీఆర్ఎస్ పార్టీకి ఇది చెంపపెట్టు అని సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చెయాలని…లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని ఆయన హెచ్చరించారు. 
 
ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందని దుయ్యబట్టారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడిందని, ఇప్పటికైనా కొంచమైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు.
ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. ఈసీ ,రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని , విశ్వాసాన్ని పెంచిందని బండి సంజయ్ కొనియాడారు.

పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందంజ

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు చెల్లని ఓట్లుగా తేలాయి. మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40 శాతానికి పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కాగా,  పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం 150 డివిజన్లకు గాను.. బీజేపీకి 92 డివిజన్లలో ఆధిక్యం లభించగా.. టీఆర్ఎస్‌కు 33 డివిజన్లలో ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించింది.