కరోనా టీకా వచ్చినా మాస్కులు  తప్పనిసరి

కరోనా టీకా వచ్చినా సరే మాస్కులను ధరించడం తప్పనిసరి, కరోనా కట్టడి కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని భారత వైద్య పరిశోధన మండలి చీప్‌ ప్రొఫెసర్‌ బలరామ్‌ భార్గవ స్పష్టం చేశారు.

కోవిడ్‌ వ్యాధి నిర్వహణ-మార్పులు అనే అంశంపై కోల్‌కతాలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెబినార్‌లో బలరామ్‌ భార్గవ మాట్లాడుతూ టీకా వచ్చినా సరే ప్రజలు సుదీర్ఘకాలంపాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. 

కాగా, టీకా రూపకల్పనలో భారత్‌ అద్భుత ప్రగతి సాధిస్తోందని కొనియాడారు. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి కరోనా టీకా వేయాలనేది తమ లక్ష్యమని తెలిపారు. ఆ తరువాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. 

ఇక భారత్‌ తన కోసమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా టీకా అభివృద్ధి చేస్తోందని వెల్లడించాయిరు. మొత్తం 24 టీకా తయారీ యూనిట్లు, 19 సంస్థలు ఈ క్రతువులో భాగమయ్యాయని చెప్పారు. 

మాస్కులు అంటే దుస్తులతో చేసిన టీకా లాంటిదని అభివర్ణించారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అయిదు టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని, వాటిలో రెండు భారత్‌లో తయారైతే.. మిగతా మూడు విదేశాలకు చెందినవని చెప్పారు.

కరోనాను అంతం చేయాలంటే..టీకా ఒక్కటే సరిపోదు. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను కొనసాగించాల్సి ఉంటుందని బలరామ్‌ భార్గవ స్పష్టం చేశారు.