బీజేపీ అభ్యర్థిపై దాడి… బిజెపి నేత హరీష్ రెడ్డి అరెస్ట్!

రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్​లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, ఇతర నేతలు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  మరోవంక బీజేపీ జిల్లా అర్బన్‌ అధ్య క్షుడు పన్నాల హరీష్‌రెడ్డి అరెస్ట్‌తో ఆదివారం రాత్రి కేపీహెచ్‌పీ డివిజన్‌లో ఒక్కసారిగా రాజకీ యం హీటెక్కింది. 
 
రాజేంద్ర నగర్ డివిజన్​ పరిధిలోని హౌజింగ్​బోర్డు, పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్​ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ అభ్యర్థి, కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సమయంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్​ నేతలు దీనిపై ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. 
 
కాసేపటికే ఎమ్మెల్యే, మరో 200 మంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలా వచ్చినవాళ్లు వచ్చినట్టుగా బీజేపీ అభ్యర్థి, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో తనకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని బీజేపీ క్యాండిడేట్​ తోకల శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. 
 
టీఆర్ఎస్​ నేతలు డబ్బు పంచుతుండటంపై తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ మైలార్​దేవ్​పల్లి పోలీస్​స్టేషన్​ఎదుట ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్​ ఎమ్మెల్యే, అనుచరులు దాడులకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పోలింగ్​ ప్రశాంతంగా సాగాలంటే.. ఎమ్మెల్యేను, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని  ఆమె డిమాండ్​ చేశారు. 
 
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా.. ఈఘటనపై డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు ​ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.  
 
ఇలా ఉండగా, జేఎన్‌టీయూ రోడ్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బీజేపీకి చెందిన ఓ నాయకుడి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తుండగా హరీష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవ హరిస్తున్నారని బైఠాయించారు. 
 
పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. భాజాపా కార్యకర్తలు వందలాదిగా స్టేషన్‌కు చేరుకొని హరీష్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. హరీశ్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. పోలీసులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హరీశ్‌రెడ్డిని పరామర్శించారు.