యుపిలో `లవ్ జిహాద్’  చట్టం క్రింద మొదటి కేసు 

ఉత్తర ప్రదేశ్‌లో `లవ్ జిహాదీ’  చట్టంగా పేరొందినచట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020 ప్రకారం తొలి కేసు నమోదైంది. దేవరనియా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఓ మహిళను మతం మారాలంటూ ఒత్తిడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం నవంబరు 24న చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌కు  గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 

ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆర్డినెన్స్ ప్రకారం దేవరనియా పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. ఓ మహిళను మతం మారాలంటూ ఒత్తిడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. 

చట్టవిరుద్ధంగా మతం మారాలంటూ నిర్బంధించేవారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చునని ఈ ఆర్డినెన్స్ పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ నిర్బంధించేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించే అవకాశం ఉంది. 

మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను చట్ట విరుద్ధంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధించవచ్చు.