సందేశ్‌ఖాలీ కేసులో సిబిఐ తొలి ఎప్‌ఐఆర్

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో భూ కబ్జా, మహిళలపై లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన ఐదుగురు పలుకుబగల వ్యక్తులపై తొలి కేసును సిబిఐ నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. 

భూ వివాదానికి సంబంధించిన ఈ కేసులో బాధితుడి కుటుంబానికి చెందిన మహిళలు ఆ ప్రాంతంలోని పలుకుబడి గల వ్యక్తుల నుంచి లైంగిక దాడిని ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఐదుగురు నిందతులు, బాధితుల పేర్లను సిబిఐ ఇప్పటివరకు వెల్లడించలేదు. 

సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దాడులు, భూ కబ్జాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 10న అదేశించింది. బాధితులకు న్యాయం లభించేందుందకు నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని న్యాయస్థానం పేర్కొంది. 

అటువంటి కేసులపై ఫిర్యాదులు చేసేందుకు ఇమెయిల్ ఐడిని కూడా సిబిఐ తెలియచేయగా పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆరోపణలను నిర్ధారించుకోవడానికి సిబిఐ తన బృందాలను సందేశ్‌ఖాలీకి పంపించింది. 

ప్రాథమిక ఆధారాలు లభించిన చోట అక్కడికక్కడే కేసులు నమోదు చేయాలని సిబిఐ నిర్ణయించింది. భూ కబ్జా, మహిళలపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించిన చోట తొలి ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేసిన సిబిఐ దాన్ని కలకత్తా హైకోర్టుకు అందచేసింది.