కంగనా భవనం కూల్చివేతను తప్పుబట్టిన హైకోర్టు 

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ కు భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసును భవనాన్ని బ్రిహన్ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 
 
ఆమె భ‌వ‌నంలో కొంత భాగాన్ని కూల్చేందుకు బీఎంసీ ఇచ్చిన ఆర్డ‌ర్‌ను కొట్టేసింది. ఇది ఆమెపై ప‌గ తీర్చుకోవ‌డానికి ఇచ్చిన ఆర్డ‌ర్‌లాగా ఉంద‌ని హైకోర్టు మండిపడింది. ఏ పౌరుడిపై అయినా అధికారులు ఇలా బ‌ల ప్ర‌యోగం చేయ‌డాన్ని తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. 
 
మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తీసుకున్న చ‌ర్య అన‌ధికారం అన‌డంలో త‌మ‌కు ఎలాంటి సందేహం లేద‌ని డివిజ‌న్ బెంచ్ న్యాయ‌మూర్తులు ఎస్‌జే క‌థావాలా, ఆర్ఐ చాగ్లా తెలిపారు. సెప్టెంబ‌ర్ 9న బీఎంసీ అధికారులు త‌న బంగ్లాను కూల్చేయ‌డాన్ని స‌వాలు చేస్తూ కంగ‌నా కోర్టుకెక్కింది. 
 
బీఎంసీ ఇలా చేయ‌డం క‌చ్చితంగా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, పౌరుల హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌డమే అవుతుంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. న‌ష్ట‌ప‌రిహారానికి సంబంధించి ప్ర‌త్యేకంగా జరిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డానికి ఓ వాల్యూయ‌ర్‌ని నియ‌మిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. 2021 మార్చిలోపు జ‌రిగిన న‌ష్టంపై నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.
 
కాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. 
 
ఈ క్రమంలోనే బీఎంసీ అధికారులు నిర్ణయాన్నీ సవాలు చేస్తూ ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా  కూల్చివేతపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో పేర్కొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కంగనాకు న్యాయస్థానంలో  తొలి విజయం సహించినట్లు అయింది.