రేపు దేశ వ్యాప్తంగా జరుపుతున్న కార్మికుల సమ్మె రాజకీయ ప్రేరేపితమైనదని పేర్కొంటూ దానిలో తాము పాల్గొనబోవడం లేదని దేశంలో అతి పెద్ద కార్మిక సంఘం బిఎంఎస్ ప్రకటించింది. కార్మికుల సమస్యలపై జరిగే ప్రతి పోరాటానికి తాము రాజకీయాలకు అతీతంగా ముందు వరసలో ఉండి పోరాటం చేస్తామని, కానీ ఈ సమ్మే రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మే మాత్రమే కానీ కార్మికుల శ్రేయస్సు కోసం మాత్రం కాదని ధ్వజమెత్తింది.
ఎందుకంటే వ్యవసాయ చట్టం, విధ్యుత్ శక్తి సవరణ బిల్, జిఎస్టి వంటి దేశ ప్రజల విశాల ప్రయోజనానికి సంభందించిన విషయాలు, దేశ భద్రతకు సంభందించిన అంశాలల్లో కార్మిక సంఘాలు కల్పించుకోడం వలన కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు రాజకీయ ధృష్టి కోణంతో ఆలోచించి మరుగున పడవేసి అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
దేశానికి స్వాతంత్రం సిద్దించి 73 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికి కేవలం దేశంలోని 7 శాతం కార్మికులకు మాత్రమే ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న వివిధ కార్మిక చట్టాల ప్రయోజనాలు వర్తిస్తున్నవని పేర్కొంటూ కార్మిక చట్టాల మార్పులు చేయాలని అన్నీ జాతీయ కార్మిక సంఘాలు 2003 నుండి కార్మిక చట్టాల మార్పు కోసం పోరాటం చేశాయని గుర్తు చేసింది. కావున కేంద్ర ప్రభుత్వం 2016 లో జాతీయ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు కార్మికుల చట్టాల సవరణకు పూనుకుందని తెలిపింది.
మొత్తం కార్మిక చట్టాలు 44 అందులో 15 చట్టాలు అమలులో/ ఉపయెగం లో లేనివి తీసివేస్తే 29 కార్మిక చట్టాలను 4 కోడ్ గా మార్చారని పేర్కొన్నది. పాత చట్టాల ప్రకారం దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో 50 కోట్ల మంది కార్మికులు పనిచేస్తుండగా, ప్రస్తుతం ఈఎస్ఐ యాక్ట్ 1948 కేవలం 3.5 కోట్ల మంది కార్మికులకు మాత్రమే వర్తిస్తున్నదని తెలిపింది.
అదే విదంగా పిఎఫ్ 1952 కేవలం 4.7 కోట్ల మంది కార్మికులకు మాత్రమే వర్తిస్తున్నది. కనీస వేతనాల చట్టం 1948 కేవలం 8 శాతం కార్మికులకు మాత్రమే వర్తిస్తున్నది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లోని సౌకర్యాలు, కార్మిక నష్ట పరిహార చట్టం, మహిళ ప్రసూతి చట్టాల్లోని లాభాలు కేవలం 6 నుండి 8 శాతం కార్మికులకు వర్తిస్తున్నది. ఇప్పుడు మార్పు చేసీన చట్టాల ప్రకారం 50 కోట్ల మంది కార్మికులకు న్యాయం జరగబోతున్నదని బిఎంఎస్ గుర్తు చేసింది.
కావున కార్మికులకు లాభం చేకూరే కొత్త కోడ్ ల్లోని వివిధ అంశాలను బిఎంఎస్ స్వాగతిస్తుంది. మార్పు చేసీన చట్టం ప్రకారం జాతీయ స్థాయిలో కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. వాటి కన్నా తక్కువ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకూడదు. ఈ కనీస వేతనాల చట్టాలు ప్రతి ఐదు సంవత్సరమునకు ఒకసారి సవరణ చేయాలి, కావున బిఎంఎస్ ఈ మార్పును స్వాగతిస్తుందని స్పష్టం చేసింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలు సవరణ అమలు చేయడం లేదని విమర్శించింది. 2010 నుండి ఇప్పటివరకు కనీస వేతనాల సవరణ జరగలేదు. ఈలాంటి పరిస్థితి బహుషత్ లో ఉండకుండా ప్రతి ఐద సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా వేతనాల సవరించడం వలన లక్షలాది కార్మికులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. .
అట్లాగే కొత్త కోడ్ ల ప్రకారం ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన ప్రతి కార్మికుడికి గ్రాట్యువిటికి అర్హత పొందుపరిచారు. ఈ సౌకర్యం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింపచేస్తారు. పాత చట్టం ప్రకారం గ్రాట్యువిటి పొందాలంటే కార్మికులందరికి కనీసం ఐదు సంవత్సరాల సర్వీసు చేయాలి. సామజిక భద్రత కోడ్ ప్రకారం ఇఎస్ఐ, పిఎఫ్; ఓఎస్హెచ్ కోడ్ ప్రకారం భద్రత పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులందరికి సమానంగా వర్తింపజేస్తారు. కావున బిఎంఎస్ ఈ మార్పును స్వాగతిస్తుంది.
అయితే మార్పు చేసిన కోడ్ లలో కార్మికులకు వ్యతిరేకంగా అనేక అంశాలను ఉన్నట్లు బిఎసిఎస్ స్పష్టం చేసింది. ముఖ్యంగా కంపెనీ లే ఆఫ్/ మూసివేత చేయాలంటే ప్రస్తుతం 100 మంది ఆ పైన కార్మికులుంటే ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ ఐఆర్ కోడ్ లో చేసిన మార్పు ప్రకారం 300 మంది ఆ పైన కార్మికులుంటేనే ప్రభుత్వ అనుమతి అవసరమని పొందుపరిచారు.
స్టాండింగ్ ఆర్డర్స్ లో ప్రస్తుతం 100 మంది ఆ పైన కార్మికులుంటే అమలు చేయాలి కానీ మార్పులు చేసిన కోడ్ చట్టం ప్రకారం 300 మంది ఆ పైన ఉంటేనే అమలు చేస్తారు. బిఎంఎస్ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రధానికి వినతిపత్రం ఇచ్చిన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో జాతీయ కార్మిక సంఘాలతో చర్చలకు ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి కార్మికులు ఆందోళన చెందవసిన అవసరం లేదని బిఎంఎస్ హితవు చెప్పింది.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
కాంగ్రెస్ ను వివాదంలోకి నెట్టిన శ్యామ్ పిట్రోడా
దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది