విద్యుత్‌ నెట్‌వర్క్‌పై సైబర్ దాడుల ప్రమాదం!

విద్యుత్‌ నెట్‌వర్క్‌పై సైబర్ ముక్కలు దాడులకు పాల్పడే అవకాశముందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుచేత, విదేశీ విద్యుత్‌ ఉపకరణాల దిగుమతిలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేసింది.

ఏ చిన్నవస్తువునైనా తాము సూచించిన ల్యాబరేటరీలో పరీక్ష చేయకుండా విద్యుత్ రంగం‌లోకి తీసుకోవద్దంటూ ఇటీవల ఆదేశించింది. విద్యుత్‌ అనేది ప్రధాన జాతీయ మౌలికవనరు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైనది.

విద్యుత్‌ వ్యవస్థపై సైబర్‌ దాడి చేస్తే తక్షణమే కోలుకునే అవకాశం ఉండదని కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేసాయి. ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే అవకాశం ఉందని హెచ్చరించాయి. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా అంతా కంప్యూటర్‌ అనుసంధానంతోనే సాగుతోంది.

జాతీయ, రాష్ట్రీయ గ్రిడ్‌లో కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ ముఖ్యమైంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలన్నీ గ్రిడ్‌కే లింక్‌ అయి ఉంటాయి. ప్రస్తుతం మనం విద్యుత్‌ ఉపకరణాలను దాదాపుగా విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం.

వీటి తయారీలో సాఫ్ట్‌వేర్‌దే కీలక పాత్ర. ఈ క్రమంలో సైబర్‌ మూకలు విద్యుత్‌ ఉపకరణాల ద్వారా వైరస్‌లను పంపే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే విదేశీ ఉపకరణాలను పరీక్షించేందుకు కేంద్రం ఆధీనంలో ఉండే ప్రత్యేక ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది.

దిగుమతి అయిన ఉపకరణాల నాణ్యత, వాటి సెక్యూరిటీని ఈ ల్యాబుల్లో పరీక్షించి ధ్రువీకరించిన తర్వాతే విద్యుత్‌ సంస్థలకు అనుమతించాలని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఈ నిబంధన ప్రయివేటు ఉత్పత్తి సంస్థలకూ కూడా వర్తించనుంది.