డిసెంబర్ లోకరోనా ఉధృతి….  సుప్రీం హెచ్చరిక 

కరోనా ఉధృతిని అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికలు చేపట్టకపోతే డిసెంబర్‌లో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని రాష్ట్రాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, అసోంలలో గత రెండు రోజులుగా పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదౌతుండటంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నెలలో కరోనా విజృంభించవచ్చని వింటున్నామని, పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికలు అందించాలని ఈ నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది. కరోనాను అడ్డుకునేందుకు సంసిద్ధం కాకపోతే అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది. 
 
రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి, రోగుల నిర్వహణ, కరోనా కట్టడికి తీసుకున్న చర్యల నివేదికను అందించాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్‌. సుభాష్‌ రెడ్డి, ఎంపి షా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాల్లో కరోనా కేసులు విస్తృతంగా పెరగటాన్ని సుమోటో స్వీకరించిన కోర్టు దీనిపై విచారణ చేపట్టింది.
 
అదేవిధంగా ఢిల్లీ, గుజరాత్‌లలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారడంపై మండిపడింది. ఢిల్లీలో పరిస్థితులు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులేంటని? కరోనా కట్టడికి తీసుకున్న అదనపు చర్యలేంటని ప్రశ్నించింది. 
 
కాగా, ఢిల్లీలో తీసుకుంటున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానానికి ప్రభుత్వం వివరించింది. ఢిల్లీ తర్వాత అంతే అధ్వానమైన పరిస్థితులు గుజరాత్‌లో ఉన్నాయని, కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.