బీజేపీ మేయర్ కావాలో… ఎంఐఎం మేయర్ కావాలో

బీజేపీ మేయర్ కావాలో… ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కోరారు.  కేసీఆర్, ఓవైసీ లాంటి కుటుంబ పార్టీల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై ఆదివారం ఓ ఛార్జ్‌షీట్‌ను ఆయన విడుదల  చేస్తూ  దుబ్బాక ఫలితాల్లో ఏం జరిగిందో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రిపీట్ కాబోతోందని భరోసా వ్యక్తం చేశారు.

హైదరాబాదీలు కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే మతతత్వ ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని, ఎంఐఎంకు ఓటు వేస్తే విభజన వాదానికి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేవలం అక్బర్, అసదుద్దీన్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్ ఆరేళ్ల పాలన అవినీతికి చిరునామా అని మండిపడ్డారు.  

కేసీఆర్‌‌కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లే. కాంగ్రెస్‌‌‌కు ఓటేసినా ఎంఐఎంకు ఓటేసినట్లే. అదే ఎంఐఎంకు ఓటేస్తే డివిజన్ (చీలిక)కు ఓటేసినట్లే. అందుకే బీజేపీకి మేయర్ పీఠం ఇవ్వాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించారని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

ఒకే కుటుంబం పాలన సాగిస్తుండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెబుతూ ఎంఐఎం కూడా ఒక కుటుంబ పార్టీనే అని స్పష్టం చేశారు. అక్కడ కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు.. ఇక్కడ అసదుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలు ఉన్నారు. ఈ పార్టీలు గత ఆరేళ్లలో ప్రజలను దోచుకున్నాయని ధ్వజమెత్తారు.

 హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ చివరికి వరదల నగరంగా మార్చేశారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.  సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయని, అదే పేద ప్రజల ఆస్తులు రానూరానూ తరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.  

లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. మూసీ నదిని ప్రక్షాళన చేశామని టీఆర్‌ఎస్ సర్కార్ పదేపదే ప్రకటిస్తోందని, కొబ్బరి నీళ్లలాంటి మూసీ నీటిని సీఎం కేసీఆర్ తాగుతారా? అని ప్రశ్నించారు.

 ప్రధాని మోదీ రెండున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తే కేసీఆర్ రెండు వందల ఇళ్లను కూడా నిర్మించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలిసి, సీఎం ఫాంహౌజ్‌లో పడుకున్నారని ఆయన విమర్శించారు. 

ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేదని, ఈ విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణను సాధించడంలో బీజేపీ పాత్ర కీలకమని చెబుతూ సుష్మా స్వరాజ్ లేకపోయినా ఆమె పోరాట స్ఫూర్తిని మాత్రం తెలంగాణ ప్రజానీకం మరిచిపోదని జవదేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఈ ఆరేళ్లలో కేసీఆర్ ఆస్తులు పెరిగాయని.. అలాగే తెలంగాణ రాష్ట్ర అప్పులూ పెరిగాయని దుయ్యబట్టారు.  కేసీఆర్‌‌ ఫ్యామిలీతోపాటు ఆయన సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు.