‘లవ్ జీహాద్’ మహిళల హక్కులకు విఘాతం  

‘లవ్ జీహాద్’ వల్ల మహిళల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ చెప్పారు. ‘లవ్ జీహాద్’ను నిరోధించేందుకు చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

మహిళలపై హింసకు మారు పేరు ‘లవ్ జీహాద్’ అని ఆయన తెలిపారు. ఓ పురుషుడు తన వివరాలను దాచిపెట్టి, తప్పుడు వివరాలను తెలియజేసి, మహిళను మోసం చేయడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

పురుషుడి ప్రతిపాదనను మహిళ తిరస్కరిస్తే, ఆమెను అతడు బలవంతం చేయడానికి లేదా కాల్చి చంపడానికి కూడా వెనుకాడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేశారు. దీనిని నిరోధించవలసిన ప్రాథమిక అవసరం దేశానికి ఉందని ఆయన పిలుపిచ్చారు. 

గౌరవప్రదంగా జీవించే హక్కును ప్రతి వ్యక్తికి మన దేశం కల్పించిందని ఇంద్రేశ్ కుమార్ తెలిపారు.  ‘లవ్ జీహాద్’ ఈ హక్కులన్నిటినీ కాలరాస్తోందని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు ప్రాథమిక హక్కులు నలిగిపోవడాన్ని సమర్థిస్తున్నట్లేనని ఆయన మండిపడ్డారు.

ఇదిలావుండగా, మధ్య ప్రదేశ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తామని ప్రకటించాయి.