పార్లమెంట్‌ శీతాకాల సమవేశాలకు సిద్ధం   

పార్లమెంట్‌ శీతాకాల సమవేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే ప్రభుత్వం తేదీలు నిర్ణయిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. దేశ రాజధానిలో పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణపై నెలకొన్న ఊహాగానాల మధ్య స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. 

కరోనా మహమ్మారి మధ్య అన్ని జాగ్రత్తలతో వర్షాకాల సమావేశాలు జరిగాయని, పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించేందుకు లోక్‌సభ సిద్ధంగాఉందని, తేదీలను పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ నిర్ణయిస్తుందని ఓం బిర్లా తెలిపారు. 

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సెషన్‌ తేదీలను నిర్ణయించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలతోనూ చర్చిస్తుందని లోక్‌సభ స్పీకర్‌ పేర్కొన్నారు. 

కాగా, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 25 నుంచి రెండు రోజుల పాటు వడోదరలోని కెవాడియాలో అఖిల భారత ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం జరుగనుంది. ఇందులో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ప్రసంగించనున్నారు.

శాసన సభ, కార్యనిర్వహక న్యాయవ్యవస్థల మధ్య ‘సామరస్యపూర్వక సమన్వయం, శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి’ అనే అంశంపై చర్చించనున్నట్లు బిర్లా వివరించారు.