వైసిపి పాలనలో కుంటుపడిన అభివృద్ధి 

వైసిపి పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటు పడినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 
 
అయితే  రాష్ట్ర ప్రభుత్వ ప్రచారమే అధికంగా కనిపిస్తోందని ఆరోపించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రం ముందడుగులో ఉంటుందని హితవు చెప్పారు. 
 
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వీర్రాజు పేర్కొన్నారు. గత టిడిపి, ప్రస్తుత వైసిసి ప్రభుత్వాలు వ్యక్తి ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను చూడడం లేదని విమర్శించారు. 
 
మందస మాజీ ఎంపిపి కొర్ల కన్నారావు, ఆయన అనుచరులు వీర్రాజు సమక్షంలో బిజెపిలో చేరారు. రణస్థలం మండలంలో ఎన్‌ఇఆర్‌ క్యాంపస్‌కు వచ్చిన ఆయన ఆ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యాన పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.