కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎస్‌ఈసీ మోకాలడ్డు 

కొత్త జిల్లాల ఏర్పాటుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న  సన్నాహాలకు   రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభ్యంతరం చెప్పింది. రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.
 
ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి… మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. 
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై  సోమవారం  పలువురు సీనియర్‌ అధికారులతో సమీక్షించారు.
పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ సన్నాహాలపై ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేనిపక్షంలో జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
కాగా, జిల్లాల పునర్విభజన, ఆఫీసుల ఏర్పాటు, ఆస్తుల పంపిణీ, ఇతర మౌలిక వనరుల క ల్పనకు  ఈ ఏడాది జనవరి నాటి అంచనాల ప్రకారం రూ.1,300 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు తెలిసింది.