దీపావళికి రూ. 72 వేల కోట్ల స్థానిక వ్యాపారం

లోకల్ ఫర్ వోకల్, లోకల్ ఫర్ దీవాళి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చినట్లు రికార్డు స్థాయిలో జరిగిన అమ్మకాలు చెబుతున్నాయి. దీనికి తోడు ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి అన్న నినాదం కూడా దేశంలో బాగా పనిచేస్తోంది. 
 
దేశప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. దీపావళి నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు రూ. 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆదివారం వెల్లడించింది. 
 
చైనా ఉత్పత్తులను నిషేధించడంతో ఆ దేశానికి రూ. 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సీఏఐటీ అంచనా వేస్తోంది.  దేశంలో ప్రముఖ పంపిణీ కేంద్రాలుగా ఉన్న 20 నగరాల డేటా ప్రకారం దీపావళి పండుగ అమ్మకాల టర్నోవర్ రూ. 72 వేల కోట్లుగా ఉన్నట్టు సీఏఐటీ పేర్కొంది.
అమ్మకాలకు సంబంధించిన సర్వేలో భాగంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, రాజ్‌పూర్, భువనేశ్వరో, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్మూ, అహ్మదాబాద్, సూరత్, కొచిన్, జైపూర్, చండీఘడ్ నగరాల డేటాను సీఏఐటీ తీసుకుంది. వాణిజ్య మార్కెట్‌లో ఈ అమ్మకాలు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను సూచిస్తాయని, అంతేకాకుండా ఈ అమ్మకాలు వ్యాపారుల ముఖంపై ఆనందాన్ని తీసుకొచ్చాయని సీఏఐటీ తెలిపింది.

దీపావళి సందర్భంగా బొమ్మలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గోల్డ్, ఫుట్ వేర్, వాచ్‌లు, ఫర్నీచర్, గిఫ్ట్ ఐటమ్స్, స్వీట్స్, కిచెన్ ఆర్టికల్స్, బట్టలు తదితర వస్తువులను కూడా వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. 

భారత్, చైనా సరిహద్దుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అంటూ సీఏఐటీ కేంద్రానికి, ప్రజలకు పిలుపునిచ్చింది.