భారత్ లో డబ్ల్యూహెచ్‌ఒ వైద్య  పరిశోధన కేంద్రం 

సాంప్రదాయ వైద్యానికి సంబంధించి పరిశోధనలు చేపట్టేందుకు భారత్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియాసిస్‌  వెల్లడించారు. ఐదవ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా జైపూర్‌, జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ ఓ వీడియో సందేశం ఇస్తూ భారత్‌లో సాంప్రదాయ ఔషధాలకు సంబంధించిన అంతర్జాతీయ కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌ఒ ఏర్పాటు చేయనుందని తెలిపారు, ఇందులో సాంప్రదాయ వైద్యానికి చెందిన ఆధారాలు, పరిశోధన, శిక్షణ, అవగాహన పెంచుకోనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ వెల్లడించారు. 

సురక్షితమైన, ఆరోగ్యకరమైన వైద్య వ్యవస్థను రూపొందించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని టెడ్రోస్‌ తెలిపారు. సాంప్రదాయ వైద్య కేంద్రం కోసం భారత్ ను ‌ ఎంపిక చేయడం గర్వకారణంగా భావిస్తున్నామని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.