ప్రాచీన వైద్యమే కరోనాకు అసలైన చికిత్స  

భారతదేశ ప్రాచీన వైద్యమే కరోనా నివారణకు అసలైన చికిత్స అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు.  శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ గ్రామ పరిధిలోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ఆయుర్వేద పితామహుడు భగవాన్‌ శ్రీధన్వంతరి జయంతి సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని విశ్వ ఆయుర్వేద పరిషత్‌ ఆధ్వర్యం లో నిర్వహించారు.
చినజీయర్‌ స్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ భారతదేశ  సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానంతో మమేకమైనటువంటి వైద్యశాస్త్రమే ఆయుర్వేదమని వివరించారు.
భారతదేశ జీవన విధానంలో అనేక మార్పులను తీసుకురావడం కోసం కృషి చేయాలని సూచించారు. ఆయుర్వేద వైద్యానికి పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆయుష్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఆయుర్వేద వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేందర్ చెప్పారు. పూర్వకాలంలో భారతదేశ ఆయుర్వేద వైద్యం కనుగొన్న దేవతామూర్తి భగవాన్‌ శ్రీ ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రాచీన వైద్యంతోనే కరోనాను నియంత్రించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో ఎవ్వరికి వారే ఆయుర్వేద వైద్యం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేసిందన్నారు.  కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య రంగనిపుణులు అధికారులు పాల్గొన్నారు.