జనవరిలోనే ఆక్స్‌ఫర్డ్‌- సీరం వ్యాక్సిన్ 

సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్‌ టీకా వచ్చే ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వస్తుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అదర్‌ పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు పూణే ఆధారిత వ్యాక్సిన్‌ తయారీదారు బ్రిటిష్‌- స్వీడిష్‌ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. 

ఈ వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ పేరుతో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రస్తుతం దేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని, నియంత్రణ సంస్థల నుంచి ఆమోదాలు సకాలంలో వస్తే జనవరి నాటికి టీకా దేశంలో ఆశించవచ్చని చెప్పారు. 

ట్రయల్స్‌లో కోవిషీల్డ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళనలు చూపలేవని, ఇప్పటి వరకు దేశంలో, విదేశాల్లో వేలాది మందికి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని చెప్పారు. అయితే టీకా దీర్ఘకాలిక ప్రభావాలను నిర్ధారించేందుకు రెండు, మూడు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. 

వ్యాక్సిన్‌ ధరపై ఆయన మాట్లాడుతూ ధర నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, అందరికీ సరసమైనదిగానే ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నామన్నారు.  

కాగా, సీరం ఇనిస్టిట్యూట్‌ మొదట నెలకు 60-70 మిలియన్‌ మోతాదారులను తయారీ చేయాలని, తర్వాత వంద మిలియన్‌ మోతాదులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కొద్ది నెలల్లో తాము లక్ష్యానికి చేరుకోగలగాలి అని పూనావాలా పేర్కొన్నారు.