అర్ణబ్ అరెస్ట్ పై ఆగ్రవేశాలు… ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నట్లు మండిపాటు  

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్ట్ పై బీజేపీ, కేంద్ర మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. థాకరే ప్రభుత్వం బహిరంగంగానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు చేస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు. ఈ ఘటన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఉద్ధవ్ సర్కార్ బహిరంగంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 

పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతూ అందరూ వ్యతిరేకించాలని అమిత్‌షా పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యవహరిస్తున్నారని, థాకరే చేసిన పని ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని షా మండిపడ్డారు. 

అర్ణబ్ గోస్వామి అరెస్ట్ విషయం తెలిసి ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఓ ఆత్మహత్య కేసులో ఆయనను అరెస్టు చేయడం, అందులోనూ అర్ధాంతరంగా తెల్లవారుజామున ఇంటి వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకోవడం ఎంత మాత్రమూ సమంజసం కాదని ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అర్ణబ్ గోస్వామి పట్ల మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేని కోరినట్టు కూడా ఎడిటర్స్ గిల్డ్ వెల్లడించింది.

అర్ణబ్ అరెస్టును అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనావా తీవ్రంగా ఖందించారు. కక్షపూరిత రాజకీయాలను ఉద్ధవ్ ప్రభుత్వం మానుకోవాలని హితవు చెప్పారు. పత్రికా స్వేచ్ఛను ఉద్ధవ్ సర్కార్ కాపాడాలని, అర్ణబ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కంగన రనౌత్, మదన్ శర్మ, లేదా అర్నబ్ గోస్వామి.. ఎవరైనా కానివ్వండి. పద్ధతి మాత్రం ఒక్కటే. మీరు మా మార్గంలోకి రండి… లేదంటే బుల్డోజర్లు పంపుతాం. గుండాలను పంపుతాం. అరెస్ట్ చేసి… కొడతారు. మీ కార్యాలయం కూల్చేస్తారని కేంద్ర మంత్రి వికె సింగ్ మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే తాలిబాన్లను గుర్తు చేస్తోందని ధ్వజమెత్తారు. మీరు నిశబ్దంగా ఉండిపోతే… మీరూ సమస్యల్లో చిక్కుకుంటారని దేశ ప్రజలను హెచ్చరించారు. 

  అర్ణాబ్ గోస్వామి అరెస్టుపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. ముంబై సర్కార్ కావాలనే అర్ణాబ్‌ను టార్గెట్ చేస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయనపై అన్యాయంగా జరుగుతున్న మూకుమ్మడి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తామంతా అర్ణాబ్‌కు మద్దతుగా ఉన్నామని నెటిజన్లు లక్షల సంఖ్యలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 

అంతేకాకుండా మిగిలిన న్యూస్ చానెళ్లపై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘మాకు తెలుసు అర్ణబ్ అంటే మీకు ఇష్టం ఉండదని, కానీ ఇది అర్ణబ్ ఒక్కరి సమస్య కాదు.. మొత్తం మీడియా వ్యవస్థకే సమస్య. అవినీతితో నిండిన రాజకీయ నాయకులు కుట్రలు చేసి అర్ణబ్‌ను అరెస్టు చేయించారు.

ఇప్పుడు మీరంతా మౌనంగా ఉంటే రేపు మీ వంతూ రావచ్చు. అందుకే అందరం కలిసి మీడియా వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని అడ్డుకుందాం. అర్ణబ్‌ను కాపాడదాం’ అంటూ లక్షల మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికోసం #ArnabGoswami, #IndiaWithArnabGoswami, #IndiaStandaWithArnab వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఇప్పటికే 15 లక్షలకు పైగా ట్వీట్లు పోస్టయ్యాయి.