ఈ ఏడాది 200 మంది ఉగ్రవాదులు హతం  

జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఎక్కువగా హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన వారేనని భద్రతా అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 12 నెలల్లో 157 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. 

జూన్‌ నెలలో గరిష్ఠంగా 49 మందిని హతమార్చినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపని తెలిపారు. ఏప్రిల్‌లో 28 మందిని, జూలై, అక్టోబర్‌ నెలలో 28 మంది చొప్పున ఉగ్రవాదులను నిర్మూలించినట్లు భద్రతాధికారులు వివరించారు. 

దక్షిణ కశ్మీర్‌లో ఎక్కువ ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలుపుతూ ఈ ప్రాంతాల్లో అక్టోబర్‌ వరకు 138 మంది ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ఆకట్టుకుంటున్న పుల్వామా, షొపిన్‌ ప్రాంతాల్లో 98 మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని అధికారులు తెలిపారు. 

పాక్‌ ఆర్మీ మద్దతిస్తున్న హిజ్బుల్‌ మజాహిదీన్‌కు చెందిన 72 మంది, లష్కరే తయిబాకు చెందిన 59 మంది, జైష్ ఏ మహ్మద్‌కు చెందిన 37 మంది, ఇస్లామిక్‌ స్టేట్‌తోపాటు ఇతర ఉగ్ర సంస్థలకు చెందిన 32 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని వివరించారు.