అలజడి రేపిన పివి సింధు ట్వీట్ 

‘ఐ రిటైర్’ అంటూ ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నేడు ఇచ్చిన ట్వీట్ క్రీడాభిమానులలో అలజడి రేపింది.  డెన్మార్క్ ఓపెన్‌ తన ఫైనల్ అని ట్వీట్ చేసిన సింధు, పెద్దపెద్ద ఆంగ్ల అక్షరాలతో ‘ఐ రిటైర్’ అని పోస్ట్ చేసింది. 

ఈ ట్వీట్‌తో పీవీ సింధు అభిమానులంతా ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. అయితే.. ఆమె చేసిన పోస్ట్ పూర్తిగా చూసిన వారు మాత్రం.. ఆమె మనోగతాన్ని, పోస్ట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఆమె రిటైర్‌మెంట్ ప్రకటించలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ కరోనా ఉపద్రవం తన కళ్లు తెరిపించిందని, బ్యాడ్మింటన్‌లో సమర్థులైన ప్రత్యర్థులని ఎదుర్కొనేందుకు తాను ఎంతగానో కఠోర సాధన చేశానని పీవీ సింధు తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ప్రపంచం మొత్తాన్ని ఇరకాటంలోకి నెట్టిన కంటికి కనిపించని ఈ వైరస్‌ను తాను ఎలా ఓడించాలన్న ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకడం లేదని నిరాశ వ్యక్తం చేసింది. 

కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మనమంతా బయట అడుగు పెట్టాలనుకున్న ప్రతిసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉందని సింధు తన పోస్ట్‌లో చెప్పింది. ఈ వైరస్ బారిన పడిన వారి గురించి ఎన్నో హృదయవిదారక కథనాలు తాను ఆన్‌లైన్‌లో చదివానని, ఆ సందర్భంలో తనను తాను మరింతగా ప్రశ్నించుకున్నానని ఆమె తెలిపింది.

ప్రస్తుతం తాను ఈ ఉపద్రవం వల్ల కలిగిన ప్రతికూల ఆలోచనలకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని, భయానికి, అనిశ్చితికి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని, కంటికి కనిపించని ఈ శత్రువు సృష్టించిన అదుపు తప్పిన పరిస్థితుల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని పీవీ సింధు తన సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.

ఈ వైరస్ గురించిన అర్థం లేని ఆలోచనల నుంచి, అపోహల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం మనమంతా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. కలిసికట్టుగా వైరస్‌ను ఎదుర్కోవాలని సింధు ఆకాంక్షించింది.

ప్రస్తుతం మనం ఎంచుకునే నిర్ణయాలే మన భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని, మన తరువాతి తరాల భవిష్యత్‌నూ నిర్ణయిస్తాయని, ఏమాత్రం ధైర్యం కోల్పోవద్దని పీవీ సింధు పిలుపునిచ్చింది.