తుంగభద్ర పుష్కరాలకు కఠిన ఆంక్షలు  

ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా వ్యాపించకుండా పలు జాగ్రత్తలతో  రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు పరుచనుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను, 60 ఏళ్ల పైబడిన వృద్ధులను పుష్కరాలకు అనుమతించడం లేదు.
పుష్కరాలకు హాజరయ్యే వారు గుర్తింపు కార్డుతో పాటు ఈ-పాస్ తీసుకురావాలి. ఈ-పాస్ కోసం పుష్కరాలకు 10 రోజుల ముందు మాత్రమే వెబ్ సైట్ అందుబాటులో పెట్టారు అధికారులు. పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు.. వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా లేదా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వచ్చిన మెసేజ్‌లను పుష్కరఘాట్‌లో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇక, వెబ్‌సైట్‌లో పుష్కరఘాట్లు ఉండే ప్రదేశం, రవాణా సదుపాయానికి చేసిన ఏర్పాట్లను కూడా పెట్టారు అధికారులు. పుష్కర ఘాట్లకు వచ్చేవారు కేవలం నిర్ణీత సమయాల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది.
ఘాట్ల వద్ద కేవలం 15 నిముషాలు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత సానిటైజ్ చేసి మరో బ్యాచ్ ను ఘాట్‌కు అనుమతిస్తారు. ప్రతి ఘాట్ వద్దకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
 తుంగభద్ర పుష్కరాలకు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. ఆంక్షలు, సౌకర్యాలపై ఆయా రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ లో సమాచారం చేరవేయనున్నారు అధికారులు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు.