కమల్‌నాథ్  కోడ్ ఉల్లంఘనలపై ఈసీ ఆగ్రహం  

సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు స్టార్ క్యాంపెయినర్‌ హోదాను భారత ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఎన్నికల కోడ్‌ను కమల్‌నాథ్ పదేపదే ఉల్లంఘించినందుకే  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ప్రస్తుతం కమల్‌‌నాథ్ మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక నుంచి.. కమల్‌నాథ్ చేయబోయే ఎన్నికల ప్రచారానికి ఖర్చంతా సదరు అభ్యర్థి భరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

కాంగ్రెస్‌ నుంచి ఇటీవల బీజేపీలో చేరి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఓ మహిళా అభ్యర్థి పట్ల మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందేగ్వాలియర్‌లోని డాబ్రా నియోజకవర్గంలో ఎన్నికల సభలో కమల్‌నాథ్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ అభ్యర్థి సాధారణమైన వారని, ఆమె లా ‘ఐటెం’ కాదని బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవిని ఉద్దేశించి అన్నారు. 

 మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారాన్ని రేపాయి. దళిత మహిళను కించపరచినందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై బీజేపీలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. 

కమల్‌నాథ్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లేఖ రాశారు. ఇమర్తీ దేవికి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి తోమర్‌ లేఖ రాశారు. దళిల మహిళలను గౌరవించడం కమల్‌నాథ్‌కు తెలియదని ఇమర్తీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు