వంశపారంపర్య అవినీతి దేశాన్నితొలిచేస్తున్న చెద   

వంశపారంప అవినీతి  దేశాన్ని లోలోన తొలిచేస్తున్న చెద వంటిదని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో నెలకొన్న అవినీతి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక తరం నుంచి మరొక తరానికి పాకుతున్న అవినీతి మన దేశాన్ని చెదలా తొలిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంస్థాగత నిరోధాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పరిపూర్ణ దృక్పథంతో మనమంతా కలిసి కృషి చేయవలసిన అవసరం ఉందని పిలుపిచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

అవినీతి, ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటివన్నీ ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవేనని ప్రదాని చెప్పారు. వ్యవస్థాగత నిరోధాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పరిపూర్ణ దృక్పథంతో మనమంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర ఆడిట్, సామర్ధ్య నిర్మాణం, శిక్షణ వంటివాటి ద్వారా అవినీతిని నిర్మూలించాలని స్పష్టం చేశారు.

ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానం గురించి మాట్లాడుతూ, మన దేశం కుంభకోణాల శకం నుంచి బయటపడిందని పేర్కొన్నారు.  డీబీటీ ద్వారా పేదలు నూటికి నూరు శాతం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 

వారు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోనే ఈ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ విధానం వల్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళకుండా రూ.1.70 లక్షల కోట్లు ఆదా అయిందని తెలిపారు.