వచ్చే ఏడాది వృద్ధి రేటు ఉపందుకొంటుంది 

కరోనా వైరస్‌ వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని చెబుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటు ఊపందుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెగెటివ్‌ జోన్‌లో లేదా జీరోకు చేరువగా ఉండవచ్చని తెలిపారు.

తొలి త్రైమాసంలో (ఏప్రిల్‌-జూన్‌) ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం మేర దెబ్బతినడమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ రంగం బాగా పనిచేస్తున్నదని, ఆటో అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు. 

ఇండియా ఎనర్జీ ఫోరం కార్యక్రమంలో మాట్లాడుతూ కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల జీవనోపాధి కంటే వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్చి 25 నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసిందని గుర్తుచేశారు.

అన్‌లాక్‌ తర్వాత దేశంలో స్థూల ఆర్థిక ప్రమాణాలన్నీ రికవరీ సంకేతాలను చూపాయని ఆమె తెలిపారు. పండుగ సీజన్‌ ఆర్థిక వ్యవస్థలో మరింత జోరు పెంచి మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిపై ఆశలు పెంచిందని ఆమె పేర్కొన్నారు. చ ఆర్థిక కార‍్యకలాపాలు ముమ్మరమయ్యేలా ప్రభుత్వ వ్యయం పెంచడంపై కేంద్రం దృష్టి సారించిందని వివరించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్టుతో పోల్చితే 2020 ఏప్రిల్-ఆగస్టులో కొవిడ్‌-19 ఉన్నప్పటికీ 13 శాతం వృద్ధిని సాధించిందని ఆమె వెల్లడించారు.

దేశం యొక్క ఇంధన అవసరాల ప్రస్దావిస్తూ  సమర్థమైన గ్యాసిఫికేషన్ భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. జీవ ఇంధనాల సమర్థ వినియోగాన్ని దేశం చూస్తున్నదని, అణుశక్తి కోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం చేసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.