వెంటనే రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ అమలు   

కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రూ.2 కోట్ల వరకు ఉన్నరుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్నకేంద్రం నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. నిర్దేశించిన సమయంలోగా బ్యాంకులు దీనిని అమలు చేయాలని తెలిపింది.

లోన్ మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని భారత అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.

మారటోరియం 6 నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణవడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు దానిని అందిస్తుంది.

మారటోరియం కాలంలో ఈఎంఐలపై చక్ర వడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, 21న కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.