దుబ్బాకలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలి

దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీజాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కోరారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు బంధువుల ఇళ్ళలో పోలీసుల సోదాలను ఆమె తీవ్రంగా ఖండించారు. 
 
వేల కోట్లున్న టీఆర్ఎస్ నేతలను వదిలి.. బీజేపీ నేతల ఇళ్లపై పడటం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌ గెలుపు బాధ్యతలను పోలీసులకు అప్పగించారా? అని అరుణ ప్రశ్నించారు. పోలీసులు పోస్టింగుల కోసం టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సర్వేలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడాన్ని మంత్రి హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌ను ఓడించి దుబ్బాక ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్నారని డీకే అరుణ కొనియాడారు. సిద్దిపేటలో రఘునందన్‌రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేయడం పట్ల ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.