వరద సాయం టి ఆర్ ఎస్ కారకార్యకర్తలకేనా!

హైదరాబాద్ నగరంలో వరదకు నష్టపోయిన వారికి ఇంటికి రూ 10,000 చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఆర్ధిక సహాయం అందించడం ఒక పరవశంగా మారింది. బాధితుల పేర్లను మునిసిపల్ అధికారులు నమోదు చేసుకొని, సహాయం చేయడం కాకుండా బాధితులు నేరుగా స్థానిక అధికార పార్టీ కార్పొరేట్ కు దరఖాస్తు చేసుకొంటే, ఆయన ఎంపిక చేసిన వారికే పంచడం జరిగింది. 
 
దానితో టి ఆర్ ఎస్ కార్యకర్తలు ఈ మొత్తాలను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు తలెత్తాయి. రూ 5,000 ను కార్పొరేట్ లు ఉంచుకొని, మిగిలిన సొమ్ము మాత్రమే ఇస్తున్నారని బీజేపీ ఎల్యేల్యే రాజాసింగ్ ఆరోపించారు. పలు కాలనీలలో అధికార పార్టీకి చెందిన ఎమ్యెల్యేలు, కార్పొరేటర్లను బాధితులు నిలదీస్తూ వచ్చారు. 
 
 మంత్రి కేటీఆర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలు ఫొటోలకు పోజులిచ్చేందుకే చేస్తున్నారా అని బాధితులు నిలదీశారు. ఇండ్లు నీట మునిగిన కాలనీల్లో ఆర్భాటంగా సభలు పెట్టి.. అందరిని పిలిచి  ఒకరిద్దరికి మాత్రమే ఆర్థిక సాయం అందివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని బుధవారం మంత్రి మల్లారెడ్డి, మేయర్, లోకల్​ టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లిలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆర్థిక సాయం అందిస్తారని చెప్పడంతో చాలామంది వచ్చారు. కార్యక్రమానికి మంత్రి లేటుగా రావడంతో వచ్చిన వాళ్లంతా అప్పటికే అసహనానికి గురయ్యారు.
 
 వచ్చిన మంత్రి కేటీఆర్ ఇద్దరు  మహళలను సభా ప్రాంగణం నుంచి  కొంతం దూరంగా పిలిచి వారికి చెక్కులు ఇస్తూ ఫొటోలు దిగారు. . అందరికి  ఆర్థిక సాయం అందిస్తామని పిలిచి.. మంత్రి ఒకరిద్దరికే ఇవ్వడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మీరు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసమేనా మమ్మల్ని పిలిచిందని నిలదీశారు. కేటీఆర్, సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేజీపై కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. బాధితుల్లో కోపం అంతకంతకు పెరుగుతుండడంతో కేటీఆర్​, మల్లారెడ్డి తమ పర్యటన అర్ధంతరంగా ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 

తార్నాక డివిజన్ లాలాపేట చంద్రబాబునాయుడు బస్తీలో పర్యటన సందర్భంగా కూడా మంత్రి కేటీఆర్​కు బాధితుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, స్థానిక కార్పొరేటర్ సరస్వతితో కలిసి మంత్రి కేటీఆర్ బస్తీలో కొంత మందికి నగదు అందజేసి అక్కడ నుంచి బయల్దేరారు. అయితే స్థానికులు కొందరు కాన్వాయ్​కి అడ్డం వచ్చి మా సమస్యలు వినాలని కోరడంతో కేటీఆర్ కారు దిగి రావలసి వచ్చింది