బొఫర్స్ స్కాం నీరు కార్చింది కాంగ్రెస్ వారే 

మూడు దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ ప్రభుత్వ పతనంకు దారితీసిన బోఫర్స్ కుంభకోణం నీరు కావడానికి ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అని అప్పట్లో దర్యాప్తుకు సారధ్యం వహించిన సిబిఐ డైరెక్టర్ ఆర్ కె  రాఘవన్ స్పష్టం చేశారు. 
 
నాటి ప్రభుత్వంలోని పెద్దల వల్లననే కీలక నిందితుడు ఖత్రోచి దేశం వదిలి అరెస్ట్ నుండి తప్పించుకున్నారని ఆరోపించారు. తాజాగా విడుదలైన రాఘవన్ ఆత్మకథ ‘ఏ రోడ్‌ వెల్‌ ట్రావెల్డ్‌’లో 1980లలో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్‌ కుంభకోణంపై  సంచలన విషయాలు బయట పెట్టింది.
ప్రజల నుంచి అనేక అంశాలను దాచిన ఒక పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ కేసును నీరుగార్చిందని  అంటూ కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ఆరోపించారు.
1990లలోనూ, 2004-14 మధ్య సీబీఐపై పెత్తనం సాగించిన వారి వల్లే ఈ కేసులోని దోషులను కోర్టులో నిలబెట్టలేకపోయామని కాంగ్రెస్‌ ప్రభుత్వాల‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖత్రోచిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ ప్రయత్నించగా, ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ సభ్యుడు ఈ విషయాన్ని ముందుగానే సమాచారం ఇవ్వడంతో అతడు దేశం విడిచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తంచేశారు.
స్వీడిష్‌ రేడియో, హిందూ పత్రిక బోఫోర్స్‌ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రాజీవ్‌ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ కేసులో అక్రమ సొమ్ము కొంత వరకు కాంగ్రెస్‌ పార్టీకి చేరి ఉండొచ్చు. రాజీవ్‌గాంధీకి అక్రమ సొమ్ము అందిందా లేదా అన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు.
1990లలో, తర్వాత 2004-14 మధ్య సీబీఐని నియంత్రించినవారి వల్లే కేసు అటకెక్కింది. (1991-96 మధ్య పీవీ నరసింహారావు, 2004-14 మధ్య మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.).
 ఈ కేసులో సీబీఐ మరింత వేగంగా స్పందించాల్సింది. అయితే విచారణలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. విదేశీ ప్రభుత్వాలను సంప్రదించే ప్రతి అడుగులోనూ విదేశాంగ శాఖ లేదా న్యాయ శాఖ అనుమతి అవసరమయ్యేదని గుర్తు చేశారు.
రూ.1,437 కోట్లతో హోవిట్జర్‌ శతఘ్నుల కొనుగోలు కోసం స్వీడన్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ బోఫోర్స్‌తో 1986లో నాటి రాజీవ్‌ గాంధీ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు బోఫోర్స్‌ సంస్థ నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు సుమారు రూ.64 కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా ఈ కేసులో చిక్కుకున్నారు. ఈ కుంభకోణం కారణంగానే రాజీవ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1989 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.