థార్ ఎడారిలో 1.70 లక్షల ఏళ్ళనాటి నది ఆనవాలు 

థార్ ఎడారిలో 1.70 లక్షల సంవ్స‌రాల క్రితం ప్ర‌వ‌హించి అనంత‌రం కాల ప్ర‌వాహంలో క‌నుమ‌రుగైన న‌ది ఆన‌వాళ్ల‌ను ప‌రిశోధ‌కులు తాజాగా క‌నుగొన్నారు. బిక‌నీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి ఆన‌వాలు కోల్పోయిన న‌ది గురించిన స‌మాచారాన్నిప‌రిశోధ‌కులు తాజాగా ఆధారాలతో స‌హా క‌నుగొన్నారు.
 
ఈ ప్రాంతంలో మాన‌వులు నివ‌సించేందుకు ఈ న‌ది ఒక జీవనరేఖగా ఉండొచ్చ‌ని అభిప్రాయప‌డ్డారు. ప‌రిశోధ‌న వివ‌రాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించారు. సెంట్రల్ థార్ ఎడారిలోని నాల్ క్వారీలో అదేవిధంగా ఇత‌ర ప్రాంతాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌లు నది కార్యకలాపాల దశను సూచించాయి. 
 
జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఇఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్య‌య‌నం చేశారు. రాతియుగం నాటి మాన‌వులు ప్ర‌స్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించార‌ని అధ్య‌య‌నం సూచిస్తుంది. క‌నుమ‌రుగైన న‌ది స‌మీప ఆధునిక న‌దికి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. 
 
థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్న‌ట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్త‌వేత్త‌ జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. 
 
చరిత్రపూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మ‌న‌కు చాలా తక్కువ వివరాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుండి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో న‌ది ముడిపడి ఉన్న‌ట్లుగా తెలిపారు.
ఈ నది థార్ ఎడారిలో, దక్షిణ ఆసియా అంతటా అదేవిధంగా వెలుపల మానవ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఒక క్లిష్ట వ్యవధిలో ప్రవహించించిన‌ట్లుగా బ్లింక్‌హార్న్ తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్య‌య‌నం థార్ ఎడారి గుండా ప్ర‌వ‌హించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించిన‌ట్లు పరిశోధకులు తెలిపారు. 
 
ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పుడో మాత్రం చెప్ప‌లేవ‌ని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ తెలిపారు. క‌నుమ‌రుగైన‌ న‌దీ స‌మాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్ల‌డైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది.
 
అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖ‌న‌నం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. 
 
దీన్ని ఉప‌యోగించి ఫ్లూవియ‌ల్ నిక్షేపాల దిగువ‌న చాలా చురుకైన న‌ది వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆధారాల‌ను గుర్తించిన‌ట్లు అచ్యుతాన్ చెప్పారు. సుమారు 172 మరియు 140 వేల సంవత్సరాల క్రితం నాల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు.