టీఆర్ఎస్‌ కార్పొరేటర్ పై  స్థానికుల  దాడి 

హైదరాబాద్‌లోని  టీఆర్ఎస్ కు చెందిన హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వర్షపు నీటితో పాటు, వరద నీరు నగరాన్ని ముంచిన సంగతి తెలిసిందే. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కార్పొరేటర్‌ తిరుమల రెడ్డి ఆదివారం పర్యటించారు. దీంతో ఆగ్రహించిన అక్కడి స్థానికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. రంగనాయకులగుట్టలో నాలా కబ్జాకు గురవుతుందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆయనపై దాడి చేశారు. 

స్థానికులతో తిరుమలరెడ్డి మాట్లాడుతున్న సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ మహిళ ఆయన చొక్కా లాగేందుకు ప్రయత్నించింది. నాలా గురించి ప్రశ్నిస్తూ ఆయనను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. వెంటనే స్పందించిన కొందరు స్థానికులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.