ఫామ్ హౌస్ లో కాదు కేసీఆర్ ప్రజల్లో తిరగాలి  

ముఖ్యమంత్రి కేసీఆర్  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో తిరగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బూట్ పాలిష్ గ్యాంగ్‌ను పంపకుండాసీఎం స్వయంగా కాలనీల్లో పర్యటించాలని హితవు చెప్పారు. లేకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. 

ఇవాళ దిల్‌సుఖ్ నగర్, గడ్డి అన్నారం, బైరామల్ గూడ, బంజారా కాలనీ తదితర ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజల అవస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూగత ఆరేళ్లలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని విమర్శించారు. దీనికి టీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందేన ని స్పష్టం చేశారు. 

రూ67వేల కోట్లు ఖర్చు చేశామన్నారని, అవి ఏమయ్యాయో తెలపాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాలనీలన్నీ మూసీ నదిలా మారాయని, కార్లన్నీ మునిగిపోయాయని ధ్వజమెత్తారు. రేపటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు మునుగుతుందని స్పష్టం చేశారు.

కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ రూ 5,000 కోట్ల కేంద్ర సహాయం అడుగుతున్న కేసీఆర్.. కోవిడ్ నిధులు దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. అన్నీ కేంద్రం ఇస్తే సీఎం ఎందుకున్నారని, ఎవరికోసం ఉన్నారని తీవ్రస్థాయిలో మంది పడ్డారు. 

ఉత్తగా  నిధులు ఇస్తున్నారా అంటూ కేంద్రంపై విరుచుకుపడే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వమేమైనా ప్రజలకు ఉత్తగా ఇస్తుందా అని ఘాటుగా ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లోని వారికి తిండి, నీళ్లు, కరెంట్ లేవని, వస్తువులన్నీ నానిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు, రంగారెడ్డి జిల్లా(అర్బన్) అధ్యక్షులు సామ రంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వంగా మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్ గౌడ్, కూడా పాల్గొన్నారు.