కృష్ణాపై కొత్త ట్రిబ్యునల్ కు కర్ణాటక వ్యతిరేకత 

కృష్ణా జలాల పునః పంపిణీకి కొత్త ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను తెలంగాణ, ఏపీ మధ్య పునః పంపిణీ చేసేందుకే కొత్త ట్రిబ్యునల్​ అని కేంద్రం చెప్తున్నా కర్నాటక ససేమిరా అంటోంది. 

ఈ విషయమై త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కర్నాటక నీటి వనరుల మంత్రి రమేశ్​ జార్కి హౌళి ఇటీవల ప్రకటించారు. ట్రిబ్యునల్​ ఏర్పాటు చేస్తే అది రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని, ఎగువ నుంచి వచ్చే వరదలను కచ్చితంగా లెక్కలోకి తీసుకునే నీటిని పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 

అదే జరిగితే తమ రాష్ట్ర కోటాకు గండిపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్ర సైతం కొత్త ట్రిబ్యునల్​ ఏర్పాటును వ్యతిరేకించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కృష్ణాలో 75 శాతం విశ్వసనీయత కింద 2,130 టీఎంసీల నీళ్లున్నట్టుగా గుర్తించి అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు 811 టీఎంసీలు, కర్నాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించారు.

బ్రజేశ్​ ట్రిబ్యునల్​ మిగులు జలాల​ కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు మరో 190 టీఎంసీలు, కర్నాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు ఇంకో 81 టీఎంసీలను కేటాయించింది. అయితే, బ్రజేశ్​ ట్రిబ్యునల్​ కేటాయింపులు అసంబద్ధంగా ఉన్నాయని, కర్నాటకకు లాభం చేసేలా ట్రిబ్యునల్​ వ్యవహరించిందని పేర్కొంటూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో సుప్రీం కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ ట్రిబ్యునల్​ అవార్డు కాకుండా ఆగిపోయింది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కృష్ణా నీళ్లను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. కొత్తగా ఏర్పడింది తెలంగాణ కాబట్టి ఉమ్మడి ఏపీ కేటాయింపులను పునః సమీక్షిస్తే సరిపోతుందని ఎగువ రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. అయినా తెలంగాణ ససేమిరా అంది. నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిందేనని పట్టుబట్టింది.

నాలుగేళ్ల పాటు ఇదే డిమాండ్​ చేసినా నీటి పంపకాలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో 2018లో తెలంగాణ ప్రభుత్వం తన వాదనను మార్చుకుంది. ఇంటర్​ స్టేట్​ వాటర్​ డిస్ప్యూట్స్​ యాక్ట్​1956లోని సెక్షన్​ 3 కింద ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను క్యాచ్​మెంట్​ ఆధారంగా పునః పంపిణీ చేయాలని ప్రధానికి లేఖ రాసింది.

ఇటీవల జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలోనూ ఇదే డిమాండ్ చేసింది. నీటి పంపకాలను కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ను వెనక్కి తీసుకుంటే కొత్త ట్రిబ్యునల్​ వేసేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.

కాగా, బ్రజేశ్​ ట్రిబ్యునల్​ అవార్డు అమల్లోకి రాకుండా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకుందని, ఇప్పుడు పునః పంపిణీ వ్యవహారంలో ఏ ఒక్క రాష్ట్రానికి కేటాయింపుల్లో అన్యాయం జరిగినట్టు అనిపించినా ఆ రాష్ట్రాలు మొత్తం బేసిన్​ కేటాయింపులపై పట్టుబడతాయని కర్నాటక వాదిస్తోంది.

మరోవంక, జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ప్రత్యేకంగా భేటీ అయి ట్రిబ్యునల్​ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిసింది. కర్నాటక వాటాకు ఎలాంటి ఢోకా ఉండదని, కేవలం ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను మాత్రమే పునః సమీక్షిస్తామని జోషికి షెకావత్​ హామీ ఇచ్చారు. అయినా కర్నాటక మాత్రం ఆందోళనలోనే ఉంది.