
విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు.
మొత్తం రూ.15,592 కోట్ల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్లతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్లు జాతికి అంకితం ఇచ్చారు.
కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించారు. 900 పని దినాలలో ఫ్లైఓవర్ పూర్తయింది. దక్షిణాదిలో తొలి ప్రాజెక్టుగా, దేశంలో మూడో ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తొలి రెండు ఆరు వరసల పైవంతెనలు ముంబయి, ఢిల్లీలో ఉన్నాయి.
‘‘ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయి. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతాం. రాయలసీమలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల’’ని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గడ్కరీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశా రు. ఇది రాష్ట్ర ప్రగతిని మార్చే ప్రాజెక్ట్ అని చెప్పారు. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కావడం సంతోషకర పరిణామమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసిన సీఎం, కేంద్ర పెద్దలకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
More Stories
నారా లోకేష్పై ప్రొద్దుటూరులో కోడి గుడ్ల దాడి
గోవిందరాజస్వామి ఆలయంలో రావి చెట్టు కూలి వ్యక్తి మృతి
2025 జూన్ వరకు పోలవరం గడవు పొడిగింపు