ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం  

గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. రాత్రి 10.30 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెంలోని తన ఇంటి నుండి ఎంపీ బయటకు వెళ్లే సమయంలో ఓ వ్యక్తి ఎంపి కారుకు అడ్డంగా తన బైక్‌ను పెట్టాడు.

ఆపై రాడ్డుతో ఎంపి పై దాడి చేయబోయాడు. వెంటనే అప్రమత్తమైన ఎంపి సురేష్‌ గన్‌మెన్‌ లు వ్యక్తి ని అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతుండగా, గన్‌మెన్‌ లు వెంటాడి అతన్ని పట్టుకొని తుళ్లూరు పోలీసులకు అప్పగించారు.

దాడికి యత్నించిన వ్యక్తి తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  అతను టిడిపి కార్యకర్త అని పేర్కొంటున్నారు. 

ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే లోగానే మద్యం మత్తులో ఉన్న పూర్ణచంద్రరావు తనపై దాడికి యత్నించాడని తెలిపారు.