జనం అల్లాడుతుంటే కేటీఆర్ కు రాజకీయాలా?

గతంలో ఎప్పుడూ లేని రీతిలో వర్షాలు కురిసి, వరదలతో జనం అవస్థలు పడుతుంటే మునిసిపల్ మంత్రి కేటీఆర్ రాజకీయాలు మాట్లాడుతూ ఉండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడడం వారి హోదాకు తగదని హితవు చెప్పారు.

తనకు హైదరాబాద్ ప్రజల బాగోగులే ముఖ్యమని స్పష్టం చేస్తూ వారిని ఆదుకోవడంపైనే దృష్టి పెడుతానని చెప్పారు. రాజకీయ రాద్ధాంతం చేయడానికి ఇది సరైన సమయం కాదని అంటూ వరదల్లో చిక్కుకున్న  వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

వరద ప్రభావిత ప్రజలను ఆదుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మరొక్క రోజు వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవటం‌ కష్టంగా ఉందని చెప్పారు. 

గ్రేటర్​ హైదరాబాద్​లో  రెండు మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కిషన్ రెడ్డి  బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి తన నియోజకవర్గం సికింద్రాబాద్​ పరిధిలోని  గాంధీ నగర్, దోమలగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్ పేట, కవాడిగూడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. కిషన్​రెడ్డి వెంట బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా చైర్మన్ డా. కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్నారు.

వరద ప్రాంతాలను ఆదుకునేందుకు హైదరాబాద్ పై బీజేపీ నేతలకు అంత ప్రేమ ఉంటే స్పెషల్ ప్యాకేజీ తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అనడంపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రేటర్ తో పాటు గ్రామాల్లో కూడా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తే, కేంద్రం తరఫున అధికారులు పర్యటించి నష్టంపై అంచనా వేస్తారని,  ఆ తర్వాత రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. .

తాను ఢిల్లీలో ఉన్నా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ  గ్రేటర్​లోని వరద పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించానని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆ దేశం మేరకు విజయనగరం నుంచి ఎన్డీఆర్ఎఫ్  టీమ్​లు, బోట్ లు గురువారం నగరానికి రానున్నాయని వివరించారు.  

సైన్యం సహాయం కూడా  తీసుకుంటున్నామని, వరద ప్రాంతాల్లో సైన్యం సేవలందిస్తున్నదని చెప్పారు.  వరద బాధితులకు తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తానని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలూ బస్తీల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు శాశ్వతమైన ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్ఎంసీ అధికారులను పంపకపోవడంపై సీరియస్‌ అయ్యారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. 

ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల్లో  కూడా కేంద్రంమంత్రి పర్యటించారు. . ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతితో ఫోన్‌లో మాట్లాడి  నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని సూచించారు.