భారత్ లోనే సంతృప్తికరంగా ముస్లింలు  

ప్రపంచంలోని ముస్లింలోకెల్లా భారత ముస్లింలు మాత్రమే చాలా సంతృప్తికరంగా ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దేశానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అన్ని విశ్వాసాలనూ పక్కనపెట్టి  అన్ని  మతాల వారు అనేక పర్యాయాలు ఏకతాటిపైకి వచ్చారని తెలిపారు. 

దేశంలో మూర్ఖత్వం, వేర్పాటు వాదం అనేవి కేవలం స్వలాభం కోసం పరితపించే వారితో మాత్రమే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓ హిందీ పత్రికే “వివేక్” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాణా ప్రతాప్ రాజ్యంలో అక్బర్ సేనకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాట చేశారని గుర్తు చేశారు. 

దేశానికి విపత్తు వచ్చిన సందర్భంలో అందరూ కలిసి కట్టుగా పోరాడటం భారతీయ సంస్కృతిలో భాగమని ఆయన కొనియాడారు. ‘‘భారత దేశంలోని ముస్లింలు సంతృప్తిగా ఉన్నారు. ఓ దేశం ప్రజలను పరిపాలించిన ఓ విదేశీ మతం ఇప్పటికీ ఇక్కడ ఉనికిలో ఉందా? అని ప్రపంచం ఆశ్చర్యపోతుంది’’ అని భాగవత్ పేర్కొన్నారు. 

భారత్ లో ఉన్నవిధంగా కాకుండా, పాకిస్థాన్ లో  ఇతర మతాల వారికి హక్కులివ్వలేదని, పాకిస్తాన్ ముస్లిం ప్రత్యేక దేశంగా మాత్రమే ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో హిందువులు మాత్రమే మనుగడ సాగించాలన్నది భారత రాజ్యాంగంలో లేదని చెప్పారు. 

అయితే భారత్ లో నివాసం ఉంటే మాత్రం హిందూ ఆధిపత్యాన్ని అంగీకరించి తీరాల్సిందేనని డా. భాగవత్ స్పష్టం చేశారు. తాము ముస్లింలకు ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చామని, అలా చేయడం ఈ దేశ స్వభావమని, హిందూ సంస్కృతి స్వాభావిక స్వభావమని కూడా అయాన్ తెలిపారు.

`హిందూ’ అంటే ఎవర్ని ఆరాధిస్తున్నామన్నది ముఖ్యం కాదని, ప్రజలందరిని కలిపి, వారి పురోభివృద్ధి కోసం కలసి పనిచేసే విధంగా చేసెడిదే మతం అని డా. భాగవత్ తెలిపారు. దేశ సంస్కృతి పట్ల ఆదరణ పెరిగినప్పుడు, పూర్వీకుల విధానంపై ఆసక్తి పెరిగినపుడు అందరి మధ్యా వ్యత్యాసాలు పోయి, అన్ని విశ్వాసాల ప్రజలూ ఏకతాటిపైకి వస్తారని తెలిపారు.

అయోధ్యలో రామమందిర్ నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ అది ప్రార్థనలకు, పూజలకు సంబంధించిన అంశం కాదని మన జాతీయ విలువలు, వ్యక్తిత్వంపై ప్రతీకగా నిలుస్తుందని ఆర్ ఎస్ ఎస్ అధినేత పేర్కొన్నారు. భారత దేశ ప్రజల నైతికతను, విశ్వాసాలను దెబ్బ తీయడం కోసం ఇక్కడ గతంలో దేవాలయాలను కూల్చడం జరిగినదని గుర్తు చేశారు.