దుబ్బాకలో గెలుపుకై పావులు కదుపుతున్న బిజెపి 

వచ్చే నెల జరుగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలలో ఎట్లాగైనా గెలుపొందాలని రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై బీజేపీ ముఖ్యనేతలు శనివారం హైదరాబాద్ లో సమావేశమై వ్యూహరచన చేశారు. 
 
  ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని నియమించారు. ఇప్పటికే  బీజేపీ నేత రఘునందన్‌రావు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీతోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు.  నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.  
 
ప్రజలు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని గుర్తిస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలు అప్పగిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
 
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక  నవంబర్ 3న నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను రిలీజ్ చేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. టి ఆర్ ఎస్ హయాంలో దుబ్బాక నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.