తెలంగాణ రాజ్‌ భవన్‌లో ఈ-ఆఫీస్  

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్  శుక్రవారం రాజ్‌ భవన్‌లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్‌భవన్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటుందని తెలిపారు.  ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆమె చెప్పారు.
 
తెలంగాణ గవర్నర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆమె  ఖండించారు. కరోనా కారణంగానే ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్‌భవన్‌ అడ్డా కాదని తమిళిసై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గత నాలుగు నెలలుగా రాజ్‌భవన్‌ ఇదే విధానాన్ని అవలంభిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ-మెయిల్‌ ద్వారా ఎవరైనా, ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చని ఆమె సూచించారు.  రాజ్‌భవన్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. “తెలంగాణ, తమిళనాడు నాకు రెండు కళ్లు. ప్రజాసేవ చేయడానికి సరిహద్దులు లేవు” అని ఆమె తెలిపారు.