నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక 

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేసి,   నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి,  అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది.

స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు.

దుబ్బాకతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన 56 అసెంబ్లీ స్థానాలు, ఓ ఎంపీ స్థానానికి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని వాల్మీకి ఎంపీ స్థానం ఉప ఎన్నిక జరుగనుంది.

అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్‌ రెండో వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.