వైసిపి ఎంపీ సురేష్ పై స్పీకర్ కు ఫిర్యాదు 

బాపట్ల ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు  అదే పార్టీకి చెందిన అసమ్మతి నర్సాపురం ఎంపీ కె రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నందిగం సురేశ్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓం బిర్లాకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. 

తనను సురేశ్ అసభ్య పదజాలంతో దూషించారని రఘురామరాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడిన వీడియో టేపును స్పీకర్‌కు అందజేశారు. తనపై అసభ్య పదజాలంతో, కించపరిచేవిధంగా ఎంపీ వ్యాఖ్యలు చేశారని స్పీకర్‌కు రఘురామ తెలిపారు.  

పార్లమెంట్ వెలుపల బుధవారం మీడియాతో మాట్లాడిన నందిగం సురేశ్ఎం పీ రఘురామరాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ఎంపీల గురించి, తమ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని రఘురామను సురేశ్ హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితువు చెప్పారు. 

లోక్ సభలో పార్టీ నేతగా ఉంటున్న మిథున్ రెడ్డికి వోటింగ్ జరిపితే నాలుగు ఓట్లు రావని రఘురామరాజు అంటున్నారని, ఢిల్లీలో గలీజు పనులు, మోసగాడు, చీటర్ లాంటి పదవులకు పోటీ పడితే ఆయనకే ఎంపీల ఓట్లన్నీ పడతాయని ఎద్దేవా చేశారు.