మంత్రి ముత్తంశెట్టికి కరోనా పాజిటివ్‌

ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 
ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఫోన్‌లో అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారుడు వెంకట శివసాయినందీష్‌కు కూడా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇలా ఉండగా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో అనధికార కోవిడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం రాత్రి మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అధికారులు తనిఖీకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది కోవిడ్‌ రోగులు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తున్నది. మిగిలిన వారిని విచారించగా.. తాము హోం క్వారంటైన్‌లో ఉండలేక హాయ్‌ల్యాండ్‌లో ఉంటున్నట్టు చెప్పారు. రోజుకు ఒక్కో రూమ్‌కు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.